చెత్త సేకరణకు.. ఇక నాలుగు బుట్టలు !జూన్ 4 నుంచి అమల్లోకి ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్
హైదరాబాద్, వెలుగు : మన ఊరు.. మన పరిసరాలు శుభ్రంగా ఉండాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ‘స్వచ్ఛ తెలంగాణ’లో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఘన వ్యర్థాల నిర్వహణ) రూల్స్-2026ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటివరకు తడి, పొడి చెత్త అని రెండు రకాలుగా మాత్రమే వేరు చేస్తున్నారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం చెత్తను నాలుగు రకాలుగా విభజించాల్సి ఉంటుంది. ఆకుపచ్చ బుట్టలో (తడిచెత్త) వంటగది వ్యర్థాలు, మిగిలిన ఆహారం, కూరగాయలు, పండ్ల తొక్కలు వేయాలి. దీనిని కంపోస్ట్ తయారీకి ఉపయోగిస్తారు. నీలం బుట్ట (పొడి చెత్త) ఇందులో కాగితం, అట్టపెట్టెలు, ప్లాస్టిక్, లోహపు వస్తువులను వేయాలి. వీటిని రీసైక్లింగ్ చేస్తారు. ఎరుపు బుట్ట (శానిటరీ వేస్ట్) వాడేసిన డైపర్లు, శానిటరీ ప్యాడ్లు, నాప్కిన్లు ఇందులో వేయాలి. వీటిని కాగితంలో చుట్టి మాత్రమే ఇవ్వాలి. నలుపు బుట్ట (ప్రత్యేక జాగ్రత్త చెత్త) పెయింటింగ్ డబ్బాలు, బల్బులు, పురుగుల మందుల డబ్బాలు, ఎక్స్పైరీ అయిన మందులు, సిరంజీలు, బ్యాటరీలు ఇందులో వేయాలి.
ఈ కొత్త విధానంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 5న జరిగే గ్రామసభల్లో నాలుగు రకాల చెత్త విభజనపై ప్రజలకు లైవ్ డెమో ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా గ్రామసభ ప్రాంగణంలో నాలుగు రకాల బుట్టలను ఉంచి, ఏ వస్తువు ఏ బుట్టలో వేయాలో వివరిస్తారు. అలాగే, చెత్త సేకరించే ప్రతి ట్రాక్టర్ వెనుక భాగంలో కొత్తగా ఎరుపు, నలుపు రంగు డ్రమ్ములను ఏర్పాటు చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. కాగా, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ లేదా ఇతర వ్యర్థాలను కాల్చడం, కాల్వల్లో వేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, రోగాల బారిన పడతామని అవగాహన కల్పిస్తున్నారు. గ్రామస్తులందరూ సహకరించి, ఇంటి వద్దే చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందజేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఫొటోలు, వీడియోల రూపంలో నివేదించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు.