Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Hyderabad: హైదరాబాద్లో ఎబోలా అనుమానిత కేసులు కలకలం రేపాయి. ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు వ్యక్తులను రాత్రి సమయంలో అపోలో ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఎమర్జెన్సీ విభాగంలో వారికి చికిత్స అందిస్తున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న వైద్య బృందం అవసరమైన పరీక్షలు నిర్వహిస్తోంది. రోగుల ప్రయాణ వివరాలు, వైద్య చరిత్ర, సంప్రదించిన వ్యక్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పరిస్థితిని ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక, ఇప్పటికే.. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (డీఆర్ కాంగోలో) ఎబోలా మహమ్మారి వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర స్థితిగా (పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఈ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే, ఇది అత్యంత అరుదైన వైరస్ రకానికి చెందినది. దీనికి ఎలాంటి టీకా లేదు. డీఆర్ కాంగోలో అంతర్గత సంఘర్షణలు నెలకొన్న ప్రాంతంలో ఈ కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ మహమ్మారి వ్యాప్తి ఊహించినదానికంటే వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది.