వరుసగా మూడోసారి.. ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
ఇంటర్నెట్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ సవరించకపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో జరిగిన సమీక్షల్లోనూ ఈ వడ్డీరేట్ల (RBI Interest Rates)ను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, గతేడాది మాత్రం వీటిని పలుమార్లు సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ.. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఆ తర్వాత డిసెంబరులో మరో పావుశాతం తగ్గించింది. దీంతో గతేడాది మొత్తంగా రెపో రేటు 1.25 శాతం వరకు దిగొచ్చింది.