Select Location
All Locations
State
Region
City / District
CBSE | పన్నెండో తరగతి జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్‌.. సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం..!

CBSE | పన్నెండో తరగతి జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్‌.. సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం..!

CBSE : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. పన్నెండో తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ (Re-Evaluation) ప్రక్రియ నుంచి ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (COEMPT Edutek PVT Ltd)’ సంస్థను తప్పించింది. ఈ విషయాన్ని ఐఐటీ నిపుణుల కమిటీ సభ్యుడొకరు అధికారికంగా ధృవీకరించారు. ఈ ఏడాది బోర్డు ఫలితాల తర్వాత ఆన్‌-స్క్రీన్ మార్కింగ్ విధానంలో అనేక సాంకేతిక లోపాలు, గందరగోళం తలెత్తాయి. ముఖ్యంగా ఈ సంస్థకు చెందిన సర్వర్లలో భద్రతాలోపాలు ఉన్నాయని సైబర్ నిపుణులు గుర్తించారు.

దాంతో విద్యార్థుల మార్కులు, డేటా భద్రతను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్‌ఈ తాజా నిర్ణయం తీసుకుంది. మొత్తం జవాబు పత్రాల డేటాను కోఎంప్ట్ సర్వర్ల నుంచి సీబీఎస్‌ఈ తన సొంత సర్వర్లలోకి మార్చేసింది. ఇకపై రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియ మొత్తం సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే జరగనుంది. దీనివల్ల విద్యార్థుల డేటాపై బోర్డుకు పూర్తి నియంత్రణ, భద్రత ఉంటుందని ఐఐటీ కాన్పూర్ నిపుణులు స్పష్టంచేశారు. అయితే ఈ సంస్థను తొలగించడానికి గల కచ్చితమైన కారణాలను బోర్డు ఇప్పటివరకు బహిరంగంగా వెల్లడించలేదు.

కానీ ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ నిపుణుల కమిటీ సూచనల మేరకే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫలితాల అనంతరం మార్కుల వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ కోసం విద్యార్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. జూన్ 3న ప్రారంభమైన ఈ దరఖాస్తుల విండో జూన్ 7 అర్ధరాత్రితో ముగిసింది. ఈ ఐదు రోజుల్లోనే దాదాపు 1.6 లక్షల మంది విద్యార్థులు సుమారు 3.8 లక్షల జవాబు పత్రాల పునఃసమీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారని బోర్డు వెల్లడించింది. అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో కొంతమంది విద్యార్థులకు ‘రోల్ నంబర్ నాట్ ఫౌండ్’ అని రావడంపై సీబీఎస్‌ఈ స్పష్టత ఇచ్చింది.

Source : Smacy News

2 hours ago

Home Flash News