సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. మహిళలకు 3 వేల బస్సులు, చిలకపచ్చ చీరలు
రాష్ట్రంలోని ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే వరకు తమ ప్రభుత్వం విశ్రమించదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మహిళా శక్తి సభలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఏం కావాలన్నా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మీకు అండగా ఉండే బాధ్యత నాది, మంత్రి సీతక్కది అని భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లను సైతం మహిళల పేరుపైనే ఇస్తున్నామని.. మహిళా సమాఖ్యల కోసం 3 వేల బస్సులను కేటాయించబోతున్నామని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు, త్వరలోనే ఆడబిడ్డలందరికీ చిలకపచ్చ చీరలను పంపిణీ చేయబోతున్నట్లు వెల్లడించారు.
గతంలో పెట్రోల్ బంకులు కేవలం అంబానీ, అదానీలకే పరిమితం అయ్యేవని.. కానీ నేడు నారాయణపేటలో మన మహిళలు పెట్రోల్ బంకులు నిర్వహిస్తూ లక్షలు సంపాదిస్తున్నారని సీఎం ప్రశంసించారు. కార్పొరేట్ శక్తులతో మహిళలు పోటీపడేలా చేస్తున్నామని.. కార్పొరేట్ ఆఫీసులకు ధీటుగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 8 వేల స్త్రీశక్తి భవనాలను నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల విద్యార్థినుల డ్రాపవుట్స్ తగ్గాయని.. అమ్మ ఆదర్శ పాఠశాలలు, మధ్యాహ్న భోజన సరుకుల సరఫరా, ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలను భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు.